హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): వక్ఫ్ భూముల వ్యవహారంపై సీబీసీఐడీ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో వక్ఫ్ భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతమైనట్టు తెలుస్తున్నది. అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులిచ్చి వందలాది ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు ధారదత్తం చేసిన తీరు విస్మయం కలిగిస్తున్నది. ఉద్యమకాలంలోనే వక్ఫ్భూముల పరిరక్షణ కోసం గళమెత్తిన కేసీఆర్, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ వ్యవహారంపై మరింత సీరియస్గా దృష్టిసారించారు. దర్గా, గ్రేవ్యార్డ్, మసీదు, అషూర్కానా, ఛిల్లాస్, టకీయాస్ ఇలాంటివన్నీ కలిపి 33,929 సంస్థలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 77,538.07 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డుల ఆధారంగా తెలుస్తున్నది. అయితే, వక్ఫ్బోర్డు ప్రాథమిక సర్వే ప్రకారం.. ఇందులో 6,938 మంది కబ్జాదారులు 57,423 ఎకరాల భూమిని కాజేశారని తేలింది. రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోనే 54 వేల పైచిలుకు భూములు అన్యాక్రాంతమైనట్టు గుర్తించింది. వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని సీరియస్గా తీసుకొన్న తెలంగాణ ప్రభుత్వం కబ్జారాయుళ్ల చెర నుంచి వందల ఎకరాలను విడిపించింది. కబ్జారాయుళ్లకు నోటీసులు జారీ చేసింది. 2,186 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించింది. అయితే, అన్యాక్రాంతాలకు సంబంధించిన 2,892 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి 9 మంది న్యాయవాదులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. వక్ఫ్భూముల పరిరక్షణకు శాత్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సీబీసీఐడీ విచారణకు ఆదేశించడంతో కబ్జారాయుళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఉన్నతాధికారులు రాష్ట్రంలో మొత్తం వక్ఫ్భూముల స్థితిగతులు ఎలా ఉన్నాయి? మొత్తం భూమి ఎంత? అన్యాక్రాంతమైనది ఎంత? కబ్జాదారులు ఎవరు? కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులెన్ని? వాటి ప్రస్తుత స్థితిగతులు ఏమిటి? తదితర వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల వక్ఫ్భూముల వివరాలు సేకరిస్తున్నామని, త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్ చెప్పారు.
ఇంచు కూడా వదలం
వక్ఫ్భూముల్లో ఇంచు కూడా పోగొట్టుకోకూడదని సీఎం కేసీఆర్ లక్ష్యం. సీబీసీఐడీతో విచారణ సాహసోపేత నిర్ణయం. ఇక ఎవరి బాగోతం ఏమిటో తెలిసిపోతుంది. ల్యాండ్ మాఫియా చెరలో ఉన్న భూములను తిరిగి వక్ఫ్బోర్డుకు అప్పగించడమే ప్రభుత్వ లక్ష్యం. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాం నుంచి వక్ఫ్భూముల అన్యాక్రాంతం పతాకస్థాయికి చేరింది.
-మహమ్మద్ సలీమ్, రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్
వక్ఫ్బోర్డు పరిధిలో ఉన్న సంస్థలు
సంస్థ పేరు సంఖ్య
దర్గాలు 1,869
గ్రేవ్యార్డ్స్ 8,521
మసీదులు 3,052
అషూర్ఖానాస్ 1,1056
ఛిల్లాస్ 6,789
ఠకియాస్ 112
ఇతరాలు 2,530
మొత్తం 33,929