మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు వెలిసాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో మునుగోడు ప్రజలారా.. మేం మోసపోయాం, మీరు మోసపోకండి అంటూ దుబ్బాక, హుజూరాబాద్ ప్రజల పేరుతో పోస్టర్లు అంటించారు. పట్టణం మొత్తం ఇలాంటి పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. చౌటుప్పల్ మండలం పక్కనే ఉన్న సంస్థాన్ నారాయణపురంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం.
ఇక చండూరు పట్టణంలో నేడే విడుదల అనే పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. షా ప్రొడక్షన్స్ సమర్పించు.. 18 వేల కోట్లు సినిమా సత్యనారాయణ 70 ఎంఎం థియేటర్లో నేడే విడుదలవుతున్నదని.. అందరూ చూడాలని పోస్టర్పై రాశారు. ఈ సినిమాకు కోవర్ట్ రెడ్డి దర్శకత్వం వహించారని పేర్కొన్నారు. ఈ పోస్టర్లు పట్టణం మొత్తం అంటించారు.
ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కోమటిరెడ్డికి ప్రజల నుంచి నిరసన వ్యక్తమవతున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా మునుగోడు మండలంలోని సోలిపురం గ్రామానికి వెళ్లిన రాజగోపాల్ రెడ్డిని.. ఇన్నేండ్లు ఏం చేశావ్ అని ప్రజలు నిలదీశారు. కాగా, ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వేలకోట్ల కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లారని ప్రచారాలను వెలసిన విషయం విధితమే.