సీసీసీ నస్పూర్, మే 24 : ధాన్యం అన్లోడ్ జాప్యానికి ఓ నిండుప్రాణం బలైంది. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా మూడు రోజులుగా అక్కడే నిద్రిస్తున్న ఓ లారీ డ్రైవర్ ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన ఘటన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ గోదాముల వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూర్కు చెందిన ఇంద్రావర్ శంకర్(38), తన కొడుకు ఇంద్రావర్ రోషన్తో కలిసి ఈ నెల 22న మక్కలు లోడ్ చేసుకొని నస్పూర్ పట్టణంలోని గోదాముల వద్దకు వచ్చాడు. అన్లోడ్కు అవకాశం ఇవ్వకపోవడంతో ఇక్కడే ఉంటున్నారు.
అధికారులు దూరం నుంచి వచ్చిన వాహనాలకు అనుమతి ఇవ్వకుండా లోకల్ వారికి ప్రాధాన్యతనివ్వడంతో వారు అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులుపడ్డారు. మక్కలు అన్లోడ్ చేయకపోవడంతో తాము నానా ఇబ్బందులకు గురవుతున్నామని ఆదిలాబాద్, నిర్మల్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్లు శనివారం గోదాముల వద్ద ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.
శనివారం రాత్రి తండ్రీకొడుకులు లారీపైకెక్కి పడుకొన్నారు. ఆదివారం తెల్లవారు జామున 4:30 గంటల ప్రాంతంలో శంకర్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలయ్యాయి. కొడుకు రోషన్ లేచి చూసే సరికి తండ్రి కిందపడి ఉన్నాడు. తోటి డ్రైవర్ల సాయంతో మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే శంకర్ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదవశాత్తు నిద్రలో లారీపై నుంచి కిందపడి చనిపోయినట్టు ఆయన భార్య ఇంద్రవర్ రీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మేకల ప్రశాంత్ తెలిపారు.