హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): దవాఖానల్లో పరిశుభ్రతను మరింత పెంచేందుకు తెచ్చిన నూతన విధానానికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కనీస వేతనాన్ని రూ.15,600గా నిర్ధారించింది. గతంతో పోల్చి తే ఇది సుమారు 50 శాతం ఎక్కువ. ఈ మొ త్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు.
ఈ మేరకు వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్’ (ఐహెచ్ఎఫ్ఎంఎస్) ఈ ఏడాది మార్చిలో నూతన విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకా రం ఒక్కో బెడ్కు పారిశుద్ధ్య నిర్వహణ చార్జీలను 50 శాతం పెంచింది.
గతంలో రూ. 5000 ఉండగా తాజాగా వాటిని రూ.7,500 కు పెంచింది. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను పెంచుతూ.. రూ.15,600 కనీస వేతనంగా నిర్ధారించింది. ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలను కల్పించాలని ఆదేశించింది. ఇందుకోసం కార్మికుల తరఫున రూ.1,542, ఏజెన్సీ తరఫున రూ.1,965 చెల్లిస్తారు. ఇవి మినహాయించి రూ.12,093 కార్మికుల ఖాతాలో వేయనున్నారు.
గతంలో పారిశుద్ధ్య కార్మికులకు రూ.10,700 వేతనం చెల్లించేవారు. ఇందులో పీఎఫ్, ఈసీఐ పోను కార్మికులకు రూ.8,400 ఇచ్చేవారు. ప్రభుత్వం నిర్వహణ చార్జీలు 50శాతం వరకు పెంచిన నేపథ్యంలో.. వారి వేతనాలు ఆ మేరకు పెరుగనున్నాయి. ‘ప్రభుత్వం శానిటేషన్ చార్జీలు పెంచింది. దీనికి తగ్గట్టే మీ వేతనాలు పెరుగుతాయి. కాబట్టి దవాఖానకు వచ్చే రోగులతో ఆప్యాయంగా వ్యవహరించండి. డబ్బులు వసూలు చేయడం మానేయండి’ అని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పదే పదే పారిశుద్ధ్య కార్మికులకు సూచిస్తున్నారు. ఈ మేరకు వేతనాల పెంపుతోపాటు నిబంధనలను కఠినతరం చేశారు. గతంలో నిర్దేశించిన దానికన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ సారి నేరుగా వారి ఖాతాల్లోనే వేతనాలను జమచేసేలా చర్యలు తీసుకున్నారు.
గతంలో వేతనం: రూ.10,700
నూతన వేతనం: రూ.15,600
కటింగ్స్ పోను చేతికి వచ్చే వేతనం
గతంలో రూ.8,400
ప్రస్తుతం రూ.12,093
(బాక్స్)
నూతన వేతనంలో ఇలా..
కార్మికుల ఖాతాలో చేరేది: రూ.12,093
పీఎఫ్ ఖాతాలో చేరేవి: రూ.3,023
ఈఎస్ఐ ప్రీమియం: రూ.484
మొత్తం: రూ15,600