గజ్వేల్, జనవరి 1: రీజినల్ రింగ్రోడ్డు పనులు ఈ ఏడాదే ప్రారంభమవుతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) రవీందర్రావు తెలిపారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా ధర్మారెడ్డిపల్లి వద్ద గజ్వేల్-చేగుంట రహదారి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రీజినల్ రింగ్రోడ్డులో ఉత్తర భాగం నిర్మాణానికి అధికారులు నాలుగు అలైన్మెంట్లను కేంద్ర ఉపరితల రవాణా శాఖ పరిశీలనకు పంపగా, ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం తక్కువ దూరంతోపాటు తక్కువ ఖర్చు అయ్యేలా ఉన్న అలైన్మెంట్ను ఖరారు చేసిందన్నారు. ఇప్పటివరకు ప్రిలిమినరీ సర్వే పూర్తి చేసి అలైన్మెంట్లను ఖరారు చేయగా, కేంద్రం ఆమోదంతో ఫొటోగ్రఫిక్ తదితర నిర్దిష్టమైన సర్వేలు అన్నింటినీ పూర్తిచేసి తుది ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసే పనిలో తెలంగాణ ఇంజినీర్లు తలమునకలై ఉన్నట్టు తెలిపారు. సర్వేలతోపాటు డిజైన్ తయారీకి చర్యలు చేపట్టినట్టు చెప్పారు. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ మీదుగా ఈ రీజినల్ రింగ్రోడ్డు ఉత్తర భాగం నిర్మాణం 180 కిలోమీటర్ల మేర తొలి విడత చేపట్టనున్నట్టు ఈఎన్సీ రవీందర్రావు పేర్కొన్నారు. మరో నాలుగైదు నెలల్లో భూసర్వే పూర్తవుతుందని, ఆ వెంటనే మరో నాలుగైదు నెలల్లో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి ఏడాదిలోపే రీజినల్ రింగ్రోడ్డు పనులను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
నాలుగు జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న రీజినల్ రింగ్రోడ్డు ఉత్తర భాగం గజ్వేల్ పట్టణం వెలుపల నుంచే వెళ్తుందని ఈఎన్సీ తెలిపారు. గజ్వేల్ పట్టణం వెలుపల హైదరాబాద్ మార్గాన్ని అనుసరిస్తూ ఆర్ఆర్ఆర్ నిర్మాణం చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు.