హైదరాబాద్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీసెస్ అధికారులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, లబ్ధిదారుల ఎంపికలో నైతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా గురువారం హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధాలు మంచిది కాదని హితవు చెప్పారు.
తమ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా పనిచేసే విషయంలో అధికారులకు అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించే విధంగా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఏమైనా అనుమానాలొస్తే రాజ్యాంగంతో పాటు ఆత్మప్రబోధం మేరకు పనిచేయాలని సూచించారు. పేదరికం, లింగ వివక్ష, సాంఘిక వివక్ష, మూఢ నమ్మకాలు వంటి సామాజిక దురాచారాలను నిర్మూలించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అధికారులు వృత్తితోపాటు వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతిరోజూ యోగా, వ్యాయామాలకు సమయం కేటాయించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంసీహెచ్చార్డీ డైరెక్టర్ జనరల్ హరిప్రీత్సింగ్, అదనపు డీజీ మహేశ్దత్ ఎకా, సంయుక్త డీజీ అనితా రాజేంద్రన్తో పాటు శిక్షణలో ఉన్న 247 మంది సివిల్ సర్వీసెస్ అధికారులు, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.