Voter Card | హైదరాబాద్, అక్టోబరు 25 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితాలో ఉన్న ఓటర్లందరికీ నవంబర్ 25కల్లా ఓటరు సమాచార స్లిప్లను పంపిణీ చేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఫొటోతో ఉన్న ఓటరు కార్డు లేదా మరో 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదానిని పోలింగ్స్టేషన్కు తీసుకురావాలని సూచించింది. ఓటరు తన పోలింగ్ స్టేషన్ను, ఓటర్ల జాబితాలోని తన క్రమ సంఖ్యను, పోలింగ్ తేదీ, సమయం వివరాలను తెలుసుకోవడానికి వీలుగా ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ జారీ చేస్తామని వివరించింది. భారత పాస్పోర్ట్లోని వివరాల ఆధారంగా ఓటర్ల జాబితాలో నమోదైన ప్రవాస ఓటర్లను ఓటింగ్కు అనుమతించాలని పేర్కొన్నది. పోలింగ్ స్టేషన్లో వారి పాస్పోర్ట్ ఆధారంగానే ఓటు హక్కు గుర్తించాల్సి ఉంటుందని, దీనికి ఇతర ఏ గుర్తింపు పత్రం పరిశీలించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
ఇందులో ఆధార్కార్డ్ , మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ (ఫొటోతో ఉన్నవి) పాస్బుక్లు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, జాతీయ జనాభా రిజిస్టరు జారీ చేసిన స్మార్ట్కార్డ్, భారత పాస్పోర్ట్, ఫొటోతో ఉన్న పింఛను పత్రం, ఉద్యోగులకు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ప్రభుత్వ సంస్థలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఫొటోగుర్తింపు కార్డులు, చట్ట సభల సభ్యత్వాన్ని చూపే అధికారిక గుర్తింపు కార్డులు, దివ్యాంగుల గుర్తింపు కార్డులు చూపించవచ్చని వివరించింది. ఏదైనా గుర్తింపు కార్డులో దొర్లిన చిన్న చిన్న అక్షర దోషాలను అధికారులు పట్టించుకోవద్దని ఎన్నికల సూచించింది.