హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలతో చీఫ్ ఎలక్టోరల్ అధికారి శశాంక్ గోయల్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై చర్చ జరిగింది. అనంతరం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే వాటిని ఈ నెలాఖరు వరకూ స్వీకరించనున్నారు.
ఈ ముసాయిదా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,03,56,665 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,52,57,690 మంది పురుష ఓటర్లు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,50,97,292. ఇతర ఓటర్లు 1,683 మంది ఉన్నారు. అలాగే సర్వీసు ఓటర్లు 14,501 మంది, ఎన్ఆర్ఐ ఓటర్లు 2,742 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 5,01,836 మంది ఉన్నట్లు ముసాయిదాలో పేర్కొన్నారు.
వచ్చే ఏడాది జనవరి 5న ఓటర్ల తుది జాబితాను వెల్లడిస్తారు. కాగా, ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గంలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 6న ప్రకటించనున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను డిసెంబరు 6 వరకూ స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.