హుజూరాబాద్, జూలై 24: మాజీ ఎంపీ వొడితల రాజేశ్వర్రావు ఎన్నో సుగుణాలు మూర్తీభవించిన ఓ మహా శిఖరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు కొనియాడారు. తెలంగాణ సాధనలో ఆయన కీలక భూమిక పోషించినట్టు తెలిపారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నడిచారని చెప్పారు. కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రం సిద్ధిస్తుందని ఆయన ఆ నాడే చెప్పారని గుర్తుచేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని సింగాపూర్లో వొడితల రాజేశ్వర్రావు విగ్రహాన్ని మంత్రి గంగుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో కలిసి హరీశ్రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మనుమడు వొడితల ప్రణవ్బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ.. రాజేశ్వర్రావు సింగాపురం సర్పంచ్గా, సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా వివిధ హోదాల్లో సేవలు అందించారని చెప్పారు. పీవీ ప్రధానిగా ఉన్న కాలంలో దేశరాజకీయాల్లో తెరవెనుక చక్రం తిప్పినట్టు తెలిపారు. వొడితల వంశంలోనే సేవాగుణం ఉన్నదని, రాజేశ్వర్రావు వేసిన బాటలో ఆయన సోదరుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావుతోపాటు కుటుంబ సభ్యులు నడుస్తున్నారని కొనియాడారు.
ఆయన మాటల్లోని తీయదనం, ఆప్యాయత, దాతృత్వం, నిరాడంబరత ఇలా ఎన్నో సుగుణాలు మూర్తీభవించిన ఓ మహా శిఖరమని కీర్తించారు. ఉద్యమ సమయంలో తమను ఎన్నోసార్లు ప్రేమతో పిలిచి అన్నం పెట్టిన ఆత్మీయులని చెప్పారు. అనేక విద్యాసంస్థలను నెలకొల్పి ఎందరో విద్యార్థుల ఉజ్వల భవితకు బాటలు వేశారని పేర్కొన్నారు. పత్రికలకు ఆయన రాసిన వ్యాసాలు ఎంతో మందిని ఉత్తేజితులను చేశాయని, తెలంగాణ ఆవశ్యకతను వివరించాయని తెలిపారు. ఆయన వ్యక్తిత్వం నేటి యువతకు ఆదర్శమని అన్నారు. మంత్రి గంగుల మాట్లాడుతూ.. విద్యాప్రదాతగా, గొప్ప మానవతావాదిగా, ఎదుటి వ్యక్తి బాధపడితే తక్షణమే స్పందించే విశాలహృదయం కలిగిన గొప్ప నేత రాజేశ్వర్రావు అని కొనియాడారు. ఎంతోమంది వెనుకబడిన కులాల సంక్షేమానికి కృషి చేసిన గొప్ప నాయకుడని అన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో రాజేశ్వర్రావు అజాత శత్రువని అన్నారు. ఊరి పేరునే ఇంటిపేరుగా మార్చుకొని పుట్టిన గడ్డపై అపారమైన మమకారం చూపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాణీదేవి, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు వొడితల సతీశ్బాబు, రసమయి బాలకిషన్, వొడితెల కుటుంబసభ్యులతోపాటు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు.