బాలాసోర్ (ఒడిశా), ఆగస్టు 23: ఉపరితలం నుంచి గగనతలానికి నిట్టనిలువుగా ప్రయోగించే క్షిపణి (వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం)ని మంగళవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ తీరం నుంచి భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), నావికాదళం సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని నావికాదళ నౌక నుంచి గగనతలంలో వేగంగా కదులుతున్న మానవరహిత లక్ష్యంపైకి ప్రయోగించామని, నిట్టనిలువుగా క్షిపణిని ప్రయోగించగలిగే (వర్టికల్ లాంచ్) సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ పరీక్ష జరిపామన్నారు. దేశీయ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను కలిగి ఉన్న ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు తెలిపారు.