హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): విశాఖ ఆర్కే బీచ్లో విచిత్రంగా ఇసుక రంగు మారిపోయింది. బంగారంలా మెరిసిపోయే ఇసుక నల్లగా మారిపోయింది. ఉన్నట్టుండి ఇసుక ఇలా ఎందుకు మారిందోనని స్థానికులు, సందర్శకులు కంగారుపడుతున్నారు. ఆవైపు వెళ్లడానికి భయపడుతున్నారు. అయితే, సముద్రంలోని మురుగు అప్పుడప్పుడు ఒడ్డుకు కొట్టుకురావడం వల్ల, ఇనుప రజను శాతం బయటికి వచ్చినా ఇసుక రంగు మారుతుందని ఏయూ ప్రొఫెసర్ ధనుంజయనాయరావు చెప్పారు.
ఇసుకను పరిశోధిస్తేనే అసలు విషయం తెలుస్తుందని అన్నారు. కాగా, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భోగాపురం మండలంలోని ముక్కాం తీరంలో సముద్రం సుమారు 150 మీటర్లు ముందుకు వచ్చింది. అలలు ఎగిసిపడుతూ మత్స్యకారుల ఇండ్లను తాకుతున్నాయి. అధికారులు మత్స్యకారులను అప్రమత్తం చేసి, వేటకు వెళ్లొద్దని రెడ్ అలర్ట్ జారీ చేశారు.