హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గురుకుల విద్యావ్యవస్థ అద్భుతమని, దేశంలో దళితుల కోసం ఇంతటి అత్యున్నత స్థాయి ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎక్కడా లేదని బీహార్ ఎమ్మెల్యే మనోజ్ మంజిల్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ తరహా విద్యావిధానం ద్వారా ఎస్సీల జీవితాల్లో మార్పులు రావడం తథ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. బీహార్లోనూ ఈ మాడల్ను అమలు చేసేలా కృషి చేస్తానని తెలిపారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన జాతీయ దళిత సమ్మిట్-2023కు హాజరైన ఆయన.. రాష్ట్రంలోని గురుకుల విద్యావ్యవస్థ గురించి తెలుసుకొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు దళిత సంఘాల ప్రతినిధులతో కలిసి గౌలిదొడ్డిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సముదాయాన్ని సోమవారం సందర్శించారు. గురుకులంలో వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. అధ్యాపకులతో భేటీ అయ్యారు. గురుకులంలో బోధన తీరును, అనుసరిస్తున్న కరికులం తదితర అంశాలను అడిగి తెలుసుకొన్నారు.
గురుకుల విద్యార్థులు సాధించిన ఫలితాలను తెలుసుకుని అబ్బురపడ్డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితబిడ్డల కోసమే 268 గురుకులాలను, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కలుపుకుని మొత్తం 1,019 గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేయ డం గొప్ప విషయమని తెలిపారు. దళిత అభ్యున్నతి, సామాజిక మార్పు విద్యతోనే సాధ్యమవుతుందని, అంబేద్కర్ సూచించిన మార్గంలోనే తెలంగాణ సర్కారు ముందుకు సాగుతున్నదని శ్లాఘించారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. వందల మంది దళిత విద్యార్థులు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ విద్యకు అర్హత సాధించటం గర్వంగా ఉన్నదని తెలిపారు.
దేశవ్యాప్తంగా దళితుల కోసం ఇలాంటి గురుకుల విద్యావ్యవస్థను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దళిత విద్యార్థులు ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. ఆయన వెంట నాయకులు ధీరేంద్రజా, యూపీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అరుణ్కోటే, కెప్టెన్ దినేశ్చంద్ర, కేరళ దళిత్ పాంథర్స్ నేత అంబుజాక్షన్, హిమాచల్ప్రదేశ్కు చెందిన దళిత సామాజిక ఉద్యమకారులు సుఖ్దేవ్, విజయ్, విద్యార్థి నాయకుడు సాయిబాలాజీతోపాటు ఎస్సీ గురుకుల అధికారులు సుక్రునాయక్, ఏవీ రంగారెడ్డి, ప్రిన్సిపాళ్లు తదితరులు ఉన్నారు.