హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): విజిటర్ వీసాల ప్రాసెసింగ్ను వేగవంతంగా పూర్తి చేయడానికి ఇకపై ఎంపిక చేసిన కాన్సులెట్లలో శనివారం కూడా ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు యూఎస్ ముంబై కాన్సులర్ చీఫ్ జాన్ బల్లార్డ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొవిడ్-19తో వీసా ప్రాసెసింగ్లో తీవ్ర జాప్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదీగాక భారత్కు యూఎస్ మిషన్ 2,50,000 కంటే ఎకువ అదనపు బీ1, బీ2 అపాయింట్మెంట్లను విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో వీసా దరఖాస్తుదారులు సుదీర్ఘకాలం నిరీక్షించకుండా చూడడంతోపాటు ఇంటర్వ్యూల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో యూఎస్ కాన్సులెట్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటికే గతంలో వీసాలు కలిగిన దరఖాస్తుదారుల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఇంటర్వ్యూ మినహాయింపు కేసుల రిమోట్ ప్రాసెసింగ్ను అమలు చేసింది. అదేవిధంగా ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి వాషింగ్టన్, ఇతర రాయబార కార్యాలయాల నుంచి తాతాలికంగా, అదనంగా కాన్సులర్ అధికారులను భారత్కు పంపింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఎంబసీ, కాన్సులేట్లకు శాశ్వతంగా కేటాయించిన కాన్సులర్ అధికారుల సంఖ్యను కూడా పెంచుతున్నది. ఈ క్రమంలో తాజాగా అదనపు అపాయింట్మెంట్ల కోసం పని వేళలను పొడిగించినట్టు జాన్ బల్లార్డ్ వెల్లడించారు. న్యూఢిల్లీలోని యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్లోని కాన్సులేట్లలో శనివారం కూడా వీసా ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాబోయే నెలల్లో ఎంపిక చేసిన శనివారాల్లో అపాయింట్మెంట్ల కోసం అదనపు స్లాట్లను తెరవనున్నట్లు వివరించారు.