ఇలాంటి ప్రాజెక్ట్ దేశంలో మరొకటి లేదు
మూడేండ్లలోనే పూర్తి చేయడం అద్భుతం
తెలంగాణ సాగు పథకాలు దేశానికే ఆదర్శం
దేశమంతా ఈ పథకాలను అమలు చేయాలి
తమిళనాడు రైతుసంఘాల నేతల ప్రశంసలు
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శన
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): దేశంలోని అన్ని రాష్ర్టాలు కూడా వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తుంటే.. కండ్ల ముందు అద్భుతమే ఆవిష్కృతమైంది. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ చేస్తున్నది. మరోవైపు రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నది. ఇప్పటికైనా రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో దేశ రైతాంగం తగిన బుద్ధి చెబుతారు. తెలంగాణ రైతుల సమస్యలను పరిష్కరించిన సీఎం కేసీఆర్కు తమిళనాడు రైతుల తరఫున ధన్యవాదాలు.
‘కాళేశ్వరం ఒక వండర్ ప్రాజెక్టు’ అని తమిళనాడు నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలు ప్రశంసించారు. ఇటువంటి ప్రాజెక్టు దేశంలో మరెక్కడా లేదని, ఇంత పెద్ద ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేసి 36 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. తమిళనాడుకు చెందిన 12 మంది రైతు సంఘాల నేతల బృందం సోమ, మంగళవారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. అనంతరం హైదరాబాద్లో రైతు నేతలు మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో సాగు పెరగడంతోపాటు రైతుల కష్టాలు తీరాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ రైతులు ఎంతో అదృష్టవంతులని అన్నారు. వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తమ రాష్ట్రంలో 60 ఏండ్లకింద ప్రారంభించిన ప్రాజెక్టులు సైతం పూర్తికాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు అలియార్ ప్రాజెక్టే ఉదాహరణ అన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించడం రైతులకు శుభపరిణామమని చెప్పారు.
తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, రుణ మాఫీ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం ఈ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని, తద్వారా దేశ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇందుకు తాము పోరాటం చేస్తామని వెల్లడించారు. తమిళనాడులో ఈ పథకాల అమలుకోసం సీఎం స్టాలిన్ను కలిసి విన్నవిస్తామని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు కూడా వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తుంటే.. కండ్ల ముందు అద్భుతమే ఆవిష్కృతమైందని ప్రశంసించారు. కేంద్రం ఒకవైపు తెలంగాణ పథకాలను కాపీ చేస్తూ, మరోవైపు రైతు వ్యతిరేక విధానాలనే అనుసరిస్తున్నదని.. ఇప్పటికైనా రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశ రైతాంగం తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ రైతుల సమస్యలను పరిష్కరించిన సీఎం కేసీఆర్కు తమిళనాడు రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో తమిళనాడు ఫార్మర్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్ నేతలు ముత్తు విశ్వనాథం, వీ శివకుమార్, వీ మంద్రాచలం, కాలిముత్తు, తెలంగాణ పసుపు రైతు సంఘం అధ్యక్షుడు నరసింహనాయుడు పాల్గొన్నారు.