ఖైరతాబాద్/హిమాయత్నగర్, సెప్టెంబర్ 27: దాసోజు శ్రవణ్ సేవలను గుర్తించి ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే, గవర్నర్ సాకులు చూపుతూ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంపై సర్వత్రా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లుతున్నాయి. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం సంక్షేమ ట్రస్ట్ చైర్మన్ లాల్కోట వెంకటాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల మనోభావాలను గవర్నర్ దెబ్బతీశారని మండిపడ్డారు. మంచి విద్యావంతుడు, బహుభాషా ప్రజ్ఞాశాలి, బీసీ సామాజికవర్గానికి చెందిన శ్రవణ్ ఎమ్మెల్సీ ప్రతిపాదనను తిరస్కరించడం బాధాకరమని పేర్కొన్నారు. హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో విలేకరుల సమావేశంలో తెలంగాణ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్ మాట్లాడుతూ దాసోజు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించి, ఆమోదించాలని డిమాండ్ చేశారు.