హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): కరెంటోళ్లను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఫ్రంట్లైన్ వారియర్లుగా విద్యుత్తు ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వేలాదిమంది వైరస్బారిన పడుతున్నారు. ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 113 మంది ఉద్యోగులు కరోనాతో మృతిచెందారు. మొదటివేవ్లో 46 మంది, రెండోవేవ్లో 67 మంది చనిపోయారు. రెండోవేవ్లో మూడు నెలల వ్యవధిలోనే ఇంతమంది మరణించటంతో మానవవనరుల కొరత ఏర్పడుతున్నది. కరోనా బారినపడిన ఉద్యోగులు, కరోనాతో మరణించినవారి సంఖ్యను పరిశీలిస్తే.. ఎక్కువ నష్టం జెన్కో, ఎస్పీడీసీఎల్కే వాటిల్లినట్టుగా తెలుస్తున్నది. మొదటి వేవ్లో ఎస్పీడీసీఎల్ పరిధిలో 20 మంది ఉద్యోగులు మరణిస్తే.. రెండో వేవ్లో ఆ సంస్థ పరిధిలో 19 మందితో కలుపుకుని మొత్తం 39 మంది మరణించారు. జెన్కోలో మొదటి వేవ్లో 12 మంది, రెండో వేవ్లో 23 మంది మొత్తం 35 మంది మరణించారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో రెండు వేవ్లలో కలిపి మొత్తం 30 మంది మరణించారు. ట్రాన్స్కో పరిధిలో మొత్తం 9 మంది మరణించారు. ఇలా ఇప్పటివరకు నాలుగు విద్యుత్తు సంస్థల్లో కలిపి 113 మంది మరణించారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు నేతృత్వంలో ఎప్పటికప్పుడు కొవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయినా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు, అత్యవసర సేవలు అందిస్తున్నప్పుడు అనుకోకుండా కరోనా సోకింది. ఇలా మొత్తం 6,305 మంది వైరస్ బారినపడ్డారు.