హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యలో డిజిటలైజేషన్కు అధిక ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ సర్కారు.. ప్రభుత్వ బడుల్లో ఆగుమెంటెడ్, వర్చువల్ రియాలిటీ (ఏఆర్/వీఆర్) ల్యాబ్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్ట్గా తొలుత రాష్ట్రంలోని ఐదు పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేయనున్నది. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ ద్వారా పాఠశాల విద్యాశాఖ అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఈ నెల 24 వరకు బిడ్స్ దాఖలుకు అవకాశం కల్పించారు. మే 5న బిడ్స్ను తెరిచి టెండర్లను ఖరారుచేస్తారు. 5 నుంచి 10 తరగతుల్లోని విద్యార్థులకు ఈ ల్యాబ్ ఆధారంగా పాఠ్యాంశాలను బోధిస్తారు. ఎస్సీఈఆర్టీ, సీబీఎస్ఈ రూపొందించిన జనరల్ సైన్స్, గణితం, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేసి విద్యార్థులు వీక్షించేలా చూస్తారు. సబ్జెక్టులవారీగా, పాఠ్యాంశాలవారీగా వీడియోలుంటాయి. ఇవి ఇన్స్టాల్ చేసిన తర్వాత సబ్జెక్టు టీచర్లకు 7-8 గంటల పాటు శిక్షణనిస్తారు. పాఠ్యాంశాలు మొత్తం ఇంగ్లిష్లోనే ఉంటాయి.
వినియోగం ఇలా..
రెగ్యులర్గా వాడే బోధనోపకరణాల స్థానంలో త్రీడీ మాడల్స్ను ఈ విధానంలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు గుండె పాఠ్యాంశాన్ని బోధించే సమయంలో ఇది వరకు గుండెను బోర్డుపై చిత్రించాల్సి వచ్చేది. భాగాలను వేర్వేరుగా గుర్తించాల్సి ఉండేది. కానిప్పుడు త్రీడీ గుండె తెరపై ప్రత్యక్షమవుతుంది. గుండె ఎలా కొట్టుకుంటుందో.. ఎలా పనిచేస్తుందో విద్యార్థులు తమకు ఇచ్చిన వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించి అర్ధం చేసుకోవచ్చు. ఈ త్రీడీ వీడియోలతో సమగ్రమైన అవగాహన తెచ్చుకోవచ్చు. ఇలా గణితం, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను టీచర్లు వీటి ద్వారా బోధిస్తారు.