హైదరాబాద్, జూలై10 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో ఈ నెల 12న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 11న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా ప్రభావంతో తిరుమలలో కొంతకాలం నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం ఆగస్టు 1నుంచి పునఃప్రారంభించనున్నట్టు తెలిపారు. జూన్లో శ్రీవారిని 23.23 లక్షల మంది భక్తులు దర్శించుకొని, రూ.123.74 కోట్లను హుండీలో కానుకలుగా వేసినట్టు వెల్లడించారు.