కరీంనగర్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాదయాత్రల పేరుతో కరీంనగర్ జిల్లా సమస్యలను ఎంపీ బండి సంజయ్ గాలికి వదిలి పెట్టారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు. ఇటీవల రాష్ర్టానికి వచ్చిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఉమ్మడి జిల్లా జాతీయ రహదారుల సమస్యను విన్నవిస్తే బాగుండేదని అన్నారు. చిత్త శుద్ధి ఉంటే ఇప్పటికైనా ఢిల్లీ వెళ్లి నిధులు, పనులు తీసుకొని రావాలని హితవు పలికారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల పలు పనులకు తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం సంతోషమే అయినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జాతీయ రహదారుల పనులను విస్మరించడం బాధాకరమని పేర్కొన్నారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర పేరిట జిల్లా సమస్యలను గాలికి వదిలేశారనీ, ఒక రోజు పాదయాత్ర ఆపి గడ్కరీని కలిసి జిల్లాలోని జాతీయ రహదారుల విషయం గుర్తు చేస్తే లాభం ఉండేదన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు తాను నాలుగు జాతీయ రహదారుల కోసం ప్రయత్నం చేసినట్టు వినోద్కుమార్ గుర్తుచేశారు. అప్పుడు ఈ పనుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిపారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాతీయ రహదారుల పనుల పర్యవేక్షణ కోసం 2016 జూన్ 24న సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) కార్యాలయాన్ని కరీంనగర్లో ప్రారంభించినట్టు గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం పనులు లేక ఆ కార్యాలయం మూతపడిందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలోనే జాతీయ రహదారుల హబ్గా కరీంనగర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు ఎస్ఈ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించామన్నారు. నాలుగు జాతీయ రహదారుల్లో ఒకటైన మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి పనులకు మాత్రమే గడ్కరీ శంకుస్థాపన చేశారనీ, మిగిలిన మూడు జాతీయ రహదారులైన కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-పిట్లం, కరీంనగర్- వీణవంక-జమ్మికుంట-టేకుమట్ల- భూపాలపల్లి, సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ- కథలాపూర్- కోరుట్ల విషయం మరిచిపోయారని పేర్కొన్నారు. ఆ జాతీయ రహదారుల పనులను తక్షణమే చేపట్టాలను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.