రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలోని నేతకార్మికులపై(Weavers) ప్రభుత్వం కక్ష కట్ట వద్దని, వెంటనే బకాయిలు చెల్లించి ఆదుకోవాలని, పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వాలని కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బీ వినోద్కుమార్(Vinod Kumar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్లలోని రాజీవ్నగర్లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నేతకార్మికుడు సిరిపురం లక్ష్మీనారాయణ కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. లక్ష్మీనారాయణ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. రూ.50వేల ఆర్థిక సాయం(Financial assistance) అందించి భరోసానిచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడారు. సిరిసిల్లలోని నేత కార్మికులు మూడు నెలలుగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాలను పోషించుకోలేక సతమతమవుతున్నారని వివరించారు. ఈ క్రమంలోనే ఉపాధి కరువై నేత కార్మికుడు లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకోవడం కలిచి వేసిందన్నారు. 20 ఏళ్ల కిందట ఇక్కడ నేతకార్మికులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటే, ఉద్యమసమయంలో కేసీఆర్ రూ.50లక్షలు అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు.
తెలంగాణ రాగానే నేతకార్మికులకు బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ సందర్భంగా అందజేసేందుకు వస్త్ర కానుకలు, పిల్లల యూనిఫాం బట్ట తయారీ ఆర్డర్లు అందించి అండగా నిలిచారన్నారు. నేత కార్మికులపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టవద్దని, వీరికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని కోరారు. నేతకార్మికులు మనోధైర్యం కోల్పోవద్దని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెప్పారు.