వేములవాడ: టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాబలంతోపాటు దైవ బలం కూడా ఉన్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తమకు మునుగోడులో గతంలోకంటే 25 వేల ఓట్లు అధికంగా వచ్చాయని చెప్పారు. ఉపఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన సాంప్రదాయ ఓట్లను కోల్పోయిందన్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్కు కనీసం డిపాజిట్ వస్తే తాను గెలిచేవాడినని చెప్పారు.
ఇతర దేశాల్లో పార్టీకి పడే ఓట్ల ఆధారంగా అభ్యర్థులు ఎన్నికవుతారని చెప్పారు. భారత్లో కూడా అలాంటి విధానమే రావాలని, దేశవ్యాప్తంగా ఎన్నికల విధానంపై చర్చజరగాల్సి ఉందన్నారు. 32 శాతం ఓట్లు వచ్చిన బీజేపీ తరపున ప్రధాని మోదీ పరిపాలిస్తున్నాడని, అయితే 62 శాతం మంది ఓటర్లు ఆ పార్టీని తిరస్కరించారన్నారు. అందువల్ల రాబోయే కొత్త తరానికి ఎన్నికల విధానంపై సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇతర దేశాల్లోలానే పార్టీకివచ్చే ఓట్లను బట్టి అభ్యర్థులు పరిపాలించే స్థాయికి చేరాలన్నారు. మేధావులు కూడా ఈ విషయంపై చర్చించాలన్నారు.
సంక్షేమంలో భాగంగానే రాష్ట్రంలోని దేవాలయాలను కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నదని వెల్లడించారు. యాదాద్రి ఆలయాన్ని ఇప్పటికే పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేశామన్నారు. అదేవిధంగా రాజన్న ఆలయ అభివృద్ధికి కూడా కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు. ఆలయ విస్తరణకు, చేయవలసిన పనులన్నీ ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ త్వరలోనే సమీక్షిస్తారని చెప్పారు. దక్షిణ కాశీగా పేరుపొందిన ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దామన్నారు. పాత ఆలయాన్ని యధావిధిగా కొనసాగిస్తూనే అభివృద్ధిని చేస్తామన్నారు.