హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్ రావు సహా నలుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, శుక్రవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో చెట్టును ఢీకొట్టింది.
దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కరీంనగర్లోని దవాఖానకు తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.