వరంగల్: తెలంగాణ ఉద్యమానికి వరంగల్ కేంద్రంగా పనిచేసిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ (Telangana) సాధించామని తెలిపారు. 2009లో తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చిన కాంగ్రెస్ (Congress) వెనక్కి లాక్కుందని విమర్శించారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఉంటే శ్రీకాంతాచారి లాంటి వాళ్లు ఆత్మబలిదానాలు చేసుకునేవారు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఆరూరి రమేశ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కర్ఫ్యూలు, 144 సెక్షన్లు లేవని చెప్పారు. హైదరాబాద్ న్యూయార్క్లా ఉందని సినీ నటుడు రజనీకాంత్ మెచ్చుకున్నారని గుర్తుచేశారు. పార్లమెంటులో ప్రతిరోజు తెలంగాణ ప్రగతి మార్మోగుతుందని చెప్పారు.
కరోనా వల్ల మూడేండ్లపాటు రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. అయినా తెలంగాణ ఆర్థికంగా అగ్రగామిగా ఉందని ఆర్బీఐ చెప్పిందన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయతో చెరువు కట్టలకు రక్షణ ఏర్పడిందని, తద్వారా భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. భూగర్భ జలాల పెరుగుదల ఐఏఎస్ ట్రైనీలకు పాఠమైందని వెల్లడించారు. 24 గంటల నిరంతర విద్యుత్, రైతుబంధుతో, రైతుబీమాతో తెలంగాణ రైతులు భరోసాతో ఉన్నారని వెల్లడించారు. కేసీఆర్ బీమాతో పేదలకు ఇంట్లో ధీమా అని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గోదవారి నది 250 కిలోమీటర్లు నిండు కుండా ఉందని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 7 వేల మెగావాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 26 వేల మెగావాట్లకు పెంచామని చెప్పారు. 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీలతో అదనంగా 10 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ఈసారి భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.