హెచ్సీయూ వీసీ బీజేరావుతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు చేయూత అందించాలని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్సీయూ) వీసీ ప్రొఫెసర్ బీజేరావుకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. గురువారం హైదరాబాద్లో బీజేరావుతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్య అభివృద్ధి, నూతన విద్యావిధానం, విద్యార్థుల అంచనాలకు అనుగుణంగా అనుసరించాల్సిన విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. నూతన విధానంలో బోధన జరిగేలా హెచ్సీయూ చొరవ తీసుకోవాలని, పరిశోధన అంశాలపై సహకారం అందించాలని కోరారు. ఇందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని బీజేరావు హామీ ఇచ్చారు. ఇటీవలే వీసీగా నియమితులైన బీజేరావును వినోద్కుమార్ సన్మానించారు. భేటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ ఉన్నారు.