నిర్మల్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని, పర్యావరణహిత గణపయ్యలనే పూజిద్దామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకొని క్లిమోమ్ ఆధ్వర్యంలో తయారు చేసిన గోమయ వినాయక ప్రతిమలను సోమవారం శాస్త్రినగర్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్లిమోమ్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉచితంగా గోమయ వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తుందన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో వీటిని అందజేస్తున్నామని తెలిపారు.
గోమయం, మట్టితో తయారు చేసిన విగ్రహాలతో ఎలాంటి హాని ఉండదని, కాలుష్యం లేని పర్యావరణ హితం కోరే ఏకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు మారుగొండ రాము, అల్లోల మరళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, క్లిమోమ్ వ్యవస్థాపకురాలు దివ్యారెడ్డి, గౌతం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.