వరంగల్: కాకతీయుల చరిత్రను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhasker) అన్నారు. కాకతీయులకు ఏడు సెంటిమెంటుగా ఉన్నదని.. ఈనేపథ్యంలోనే ఈనెల 7 నుంచి ఏడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఛత్తీస్గఢ్లో ఉన్న కాకతీయుల వారసులు కమల్ చంద్రభంజ్ చేతుల మీదుగా సప్తాహాన్ని ప్రారంభిస్తామన్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు భద్రకాళి అమ్మవారి కళాకారులతో ఆయనకు స్వాగతం పలుకుతామని వెల్లడించారు.
అదేరోజు హైదరాబాద్లో మంత్రి కేటీఆర్తో కలిసి స్టేట్ మ్యూజియంలో 777 చిత్రాల ప్రదర్శనను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ నెల 8 నుంచి 12 వరకు ప్రతిరోజు హనుమకొండలోని వేణుమాధవ్ ఆడిటోరియంలో నాటకోత్సవాలు నిర్వహిస్తామన్నారు. 13న రామప్ప ఆలయం వద్ద ముగింపు ఉత్సవాలకు మంత్రి కేటీఆర్ హాజరవుతారని వినయ భాస్కర్ వెల్లడించారు.