హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా అన్ని గ్రామాల్లో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) వెల్లడించారు. రాష్ట్రంలో రహదారుల భద్రతా చర్యలపై పోలీస్ కమిషనర్లు, ఎస్.పీ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్(Video Conference)లో ఆయన మాట్లాడారు. ఏ ఇతర నేరాలతో పోల్చినా రోడ్డు ప్రమాదాల్లో(Road Accidents) మరణించే వారి సంఖ్య అధికంగా ఉందని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నియమ, నిబంధనలను పాటించడమే ఏకైక మార్గమని అన్నారు. వీటి గురించి ప్రజల్లో చైతన్యం, అవగాహన(Awarness) కల్పించేందుకు గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీలు (Village Level Committe)ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కమిటీలో రిటైర్డ్ ఉపాధ్యాయులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సభ్యులుగా నియమించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం గణనీయంగా పెరిగిందని, ఇదే సమయంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల (Deaths )సంఖ్య కూడా పెరిగాయని అన్నారు.
తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల హాట్ స్పాట్ లను ఇప్పటికే గుర్తించామని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో హాట్స్పాట్ ప్రాంతాలలో తగు నివారణా చర్యలు చేపట్టాలని సూచించారు. తమ పరిధిలో నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ఎప్పటికప్పుడూ సమీక్ష చేయడంతో పాటు, 108 వాహన పనితీరుపై కూడా సమీక్షించాలని అధికారులకు ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లు, రోడ్లు భవనాలతో సహా సంబంధిత శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను 47 శాతం తగ్గించడంతో పాటు, 63 శాతం మరణాలను తగ్గించడంలో ములుగు జిల్లా(Mulugu District) మంచి ఫలితాలు సాధించిందని అభినందించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల ప్రాంతంలో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అధికంగా జరుగుతున్నాయని తెలిపారు.