Telangana | బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు తీయాలంటే ఏటీఎం కార్డు కావాలి.. డబ్బులు ట్రాన్సక్షన్ జరపాలంటే పాన్ కార్డు అవసరం.. ఇక ఆధార్ కార్డు అయితే అన్నింటికీ అదే ఆధారం. మన జీవితంలో అత్యంత కీలకమైన ఈ కార్డులను ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. కానీ అత్యంత భద్రంగా దాచుకోవాల్సిన ఆధార్ కార్డులు, పాన్కార్డులు, ఏటీఎం కార్డులు ఇప్పుడు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. దాదాపు 2 వేల కార్డులు ఇలా చెత్త కుప్పలో కనిపించడం వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో కలకలం సృష్టించింది. ఒక్కసారిగా చెత్తకుప్పలో కనిపించిన ఈ కార్డులు స్థానికంగా కలకలం సృష్టించాయి. కాగా, ఆ గ్రామానికి చెందిన పోస్టుమ్యాన్ ఇలా వాటిని పంచకుండా.. మితిమీరిన నిర్లక్ష్యంతో పారేశాడని తెలిసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో పోస్ట్మ్యాన్గా పనిచేస్తున్న నర్సింహులు.. ఉద్యోగం విషయంలో మితిమీరిన నిర్లక్ష్యం ప్రదర్శించారు. 2011 నుంచి డెలివరీ చేయాల్సిన ఆధార్, పాన్ కార్డులు, ఏటీఎం కార్డులను ఎవరికీ పంచుకుండా అలాగే తనదగ్గరే పెట్టుకున్నాడు. దాదాపు 13 ఏండ్లుగా తన వద్ద కుప్పలుగా పేరుకపోవడంతో ఇవాళ వాటిని మూటగట్టి చెత్తకుప్పలో పడేశాడు. అయితే చెత్తకుప్పలో ఆధార్, పాన్ కార్డులు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే వాటిని గ్రామపంచాయతీ ఆఫీసులో భద్రపరిచారు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల తండాల ప్రజలు.. గ్రామపంచాయతీకి ఎగబడ్డారు. ఆ మూటలో తమ కార్డులు ఉన్నాయేమో.. వెతికి తీసుకెళ్లారు. అలా జనాలు తీసుకెళ్లగా మిగిలిన వాటిని కట్టలుగా కట్టి ఎమ్మార్వో ప్రభులుకు అప్పగించారు. అయితే గ్రామాల సెక్రటరీ సాయంతో ఆ కార్డులను పంపిణీ చేస్తామని ఎమ్మార్వో ప్రభులు వెల్లడించారు. కాగా, అత్యంత కీలకమైన ఈ కార్డులను పంచకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోస్ట్మ్యాన్ నర్సింహులుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, కడప జిల్లా పందిర్లపల్లెలో ఓ పోస్ట్మాస్టర్ చేతివాటం ప్రదర్శించారు. ఖాతాదారులకు సంబంధించిన కోటి రూపాయలను పోస్ట్మాస్టర్ ఉమా మహేశ్వరి కొట్టేశారు. ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.