హైదరాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రిస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆగ్రోస్) చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఆగ్రోస్ కార్యాలయంలో మంత్రులు నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి సమక్షంలో సంబంధిత ఫైల్పై సంతకం చేశారు.
ఈ సందర్భంగా విజయసింహారెడ్డికి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. రైతుబిడ్డ అయిన విజయసింహారెడ్డి ఆగ్రోస్ చైర్మన్గా నియమితులవడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. విజయసింహారెడ్డి మాట్లాడుతూ ఆగ్రోస్ చైర్మన్గా నియమించి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భాసర్రావు, రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఆగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు.