హైదరాబాద్ : రాజ్భవన్లో విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి.. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ను కలిసి విజయ డెయిరీ అభివృద్ధిని వివరించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత విజయ డెయిరీ ఎంతో అభివృద్ధి చెందిందని, రూ. 61 కోట్ల లాభాల్లోకి తెచ్చామని భూమారెడ్డి తెలిపారు. ఉమ్మడి ఏపీలో విజయ డెయిరీ రూ. 30 కోట్ల నష్టంలో ఉండేదని గుర్తు చేశారు. డెయిరీ రైతు పోసే పాల మీద రూ. 4 ఇన్సెంటివ్ ఇస్తున్నామని పేర్కొన్నారు. 50 శాతం సబ్సిడీతో గేదేల పంపిణీ జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విజయ మెగా డెయిరీని రూ. 250 కోట్లతో ప్రారంభించబోతున్నామని చెప్పారు. విజయ డెయిరీ ఉత్పత్తులను అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాజ్భవన్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే విజయ డెయిరీకి గవర్నర్ సహకారం ఉండాలని లోక భూమారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ ఎండీ శ్రీనివాస్ రావు, అధికారులు పాల్గొన్నారు.