Vijaya Oil | హైదరాబాద్ : విజయ బ్రాండ్ పల్లీ నూనెను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం మార్కెట్లోకి విడుదల చేశారు. బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కల్తీ లేని ఉత్పత్తులు ఉత్పత్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విజయ బ్రాండ్ నుంచి నాణ్యమైన వంట నూనెలు అందిస్తున్నామని చెప్పారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉత్పత్తులు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. నాణ్యమైన వంట నూనెల తయారీపై ఆయిల్ ఫెడ్ దృష్టి పెట్టిందన్నారు. వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కొబ్బరి, రైస్ బ్రాన్, పామాయిల్, గానుగ నూనెలను ఆయిల్ ఫెడ్ ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. విజయ బ్రాండ్ ఉత్పత్తులను అందరూ ఆదరించాలని కోరారు. శుద్ధమయిన ఆహారాన్ని ఎంపిక చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందన్నారు.
హైదరాబాద్ నగరంలోని అన్ని రైతుబజార్లలో విజయ ఔట్ లెట్లు ఏర్పాట్లు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. మొత్తం 33 జిల్లాకేంద్రాలలో ఔట్ లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఔట్ లెట్లు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. సిద్దిపేట, వనపర్తి జిల్లాలో వచ్చే జూన్ నెలలో ప్రారంభిస్తామన్నారు.