హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): బీజేపీలో రోజుకో లొల్లి బయటపడుతున్నది. ఇన్నాళ్లూ అంతర్గతంగా జరుగుతున్న పంచాయతీలు గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం వేదికగా రచ్చకెక్కాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో తన గొంతు నొక్కేస్తున్నారని, మాట్లాడనివ్వకుండా అవమానిస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. పార్టీలో తనకు పాత్ర లేకుండా చేస్తున్నవారిని పాతరేయాలని అన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన ఓ పుస్తకావిష్కరణకు ఎంపీ కే లక్ష్మణ్, విజయశాంతి హాజరయ్యారు. లక్ష్మణ్ ప్రసం గం అయ్యాక కార్యక్రమాన్ని ముగించారు. దీంతో విజయశాంతిలో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది.
తాను మాట్లాడుదామని అనుకున్నానని, కానీ మాట్లాడనివ్వలేదని మండిపడ్డారు. ‘నేను మాట్లాడుదామని అనుకున్నాను. కానీ ఎందుకు మాట్లాడించలేదో లక్ష్మణ్ను అడగండి’ అని మీడియాకు సూచించారు. తాను ఈ మధ్య పార్టీలో ఎందుకు యాక్టివ్గా లేనో బండి సంజయ్ని అడిగి తెలుసుకోవాలన్నారు. తనను ఫైర్ బ్రాండ్ అంటారని, అలాంటిది తనను ఎందుకు సైలెంట్లో పెట్టారో మీరే రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని నిలదీసి అడగాలంటూ విలేకరులకు సూచించారు. తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించడం లేదన్నారు. జాతీయ పార్టీతో తనకు ఇబ్బంది లేదని, రాష్ట్ర నాయకత్వమే తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.