హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో రెడ్హాండెడ్గా పట్టుబడ్డ రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజితో బీజేపీ నేతలకు ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన బీజేపీ నాయకుడు విజయ్కుమార్ విషయం వెలుగులోకి రావడంతో ఆయనను సిట్ ప్రశ్నించింది. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న ముగ్గురు నిందితులకు ఆయన పలురకాలుగా సహకారం అందించినట్టు బయటపడింది. నెక్నాంపూర్కు చెందిన విజయ్కుమార్ 25 ఏండ్ల క్రితం లంగర్హౌస్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డాడు. అప్పట్లో కార్వాన్ ఎమ్మెల్యేగా ఉన్న బద్ధం బాల్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరి బస్తీ నాయకుడిగా కొనసాగారు.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఉప ముఖ్యమంత్రికి అనుచరుడిగా పైరవీలు చేయడంలో ఆరితేరాడు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్కు చెందిన నందకుమార్తో పరిచయం ఏర్పడింది. తిరిగి బీజేపీలో చేరి రామచంద్రభారతి, సింహయాజితో పరిచయం పెంచుకొని ఢిల్లీ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టాడని తెలిసింది. ఈ ముఠాతో పరిచయం ఏర్పడటంతో తాను బీజేపీ కార్యదర్శినని చెప్పుకొంటూ ఢిల్లీ స్థాయిలోని పెద్దలతోనూ పరిచయాలు ఏర్పరుచుకొన్నాడు.
ఆ పరిచయాలతో రాష్ర్టా బీజేపీ నేతలకు మరింత దగ్గరయ్యాడు. తనకు బీజేపీలో ఢిల్లీ స్థాయిలో పరిచయాలున్నాయని చెప్పుకొంటూ ఇతర పార్టీల వారిని ప్రలోభాలకు గురిచేసేవాడని తెలిసింది. నందకుమార్తో కలిసి అమాయకులకు ఉద్యోగాలు, పదవులు ఇప్పిస్తామంటూ కొందరి నుంచి డబ్బులు కూడా తీసుకొన్నట్టు సమాచారం. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి చరిత్రను శోధిస్తుండగా విజయ్కుమార్ విషయం తెలియటంతో అతనిని కూడా సిట్ శనివారం విచారించింది. సోమవారం కూడా మరోసారి విచారణకు హాజరుకావాలని సూచించింది. విజయ్కుమార్ ఎంతమందిని నందకుమార్ ద్వారా రామచంద్రభారతి గ్యాంగ్కు పరిచయం చేశాడనే విషయాలతోపాటు పైరవీల పేరుతో మోసాలపై కూడా ఆరా తీయనున్నారు.