డిచ్పల్లి, జూలై 12: తెలంగాణ యూనివర్సిటీలో మూడోసారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. పరిపాలనా భవనం కాన్ఫరెన్స్ హాల్లో పలు రికార్డులను పరిశీలించారు. వీసీ రవీందర్గుప్తా హయాంలో ఈసీ అనుమతి లేకుండా రిజిస్ట్రార్లుగా కొనసాగిన ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ విద్యావర్ధినితో పాటు మరో 8 మంది అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు విజయలక్ష్మి, సాయాగౌడ్, సూపరింటెండెంట్ భాస్కర్, ఏఈ వినోద్, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ కవితా తోరణ్, జూనియర్ అసిస్టెంట్ మధులిక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ శాంతాబాయిని విచారించి వివరాలు సేకరించారు. రిజిస్ట్రార్లుగా ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ విద్యావర్ధిని కొనసాగిన సమయంలో జరిగిన కొనుగోళ్లపై.. వారిని వేర్వేరుగా సుమారు 3 గంటల పాటు విచారించారు. వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రవీందర్గుప్తా నియామకం నుంచి ఆయన ఏసీబీ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లే వరకు జరిగిన వస్తువుల కొనుగోళ్లపై తనిఖీలు చేపట్టారు.