సిర్పూర్(టీ), ఫిబ్రవరి 26: ఒకవైపు వనపర్తి జిల్లాలో ధాన్యం బస్తాలు మాయమైన వ్యవహారం దుమారం రేపుతుండగానే తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇలాంటి బాగోతమే వెలుగుచూసింది. సిర్పూర్(టీ) మండలం వెంకట్రావ్పేట గ్రామంలోని సాయిబాలాజీ ఆగ్రో రైస్మిల్లులో 69,394 ధాన్యం బస్తాలు మాయమైనట్టు సోమవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.5.90 కోట్లు ఉంటుంది. ఈ నెల 22న కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించేందుకు రాగా.. మిల్లు మూసి ఉండటంతో ఆ రోజు వెనుదిరిగారు. మళ్లీ 23న కూడా తనిఖీలకు రాగా.. మిల్లు మూసి ఉండటం, యాజమాన్యం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తాత్కాలికంగా సీజ్ చేశారు. సోమవారం మళ్లీ తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు రాగా, సదరు రైస్ మిల్లు యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. దీంతో రైస్ మిల్లు తాళాలు పగులగొట్టి తనిఖీలు నిర్వహించారు.
69,394 ధాన్యం బస్తాలు మాయం
2022-23 యాసంగి సీజన్కు సంబంధించి 37,025 ధాన్యం బస్తాలకుగాను 9,639 మాత్రమే ఉన్నాయని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. 2023-24 వానకాలం సీజన్కు సంబంధించి 42,131 ధాన్యం బస్తాలకు 122 ధాన్యం బస్తాలు మాత్రమే ఉన్నట్టు తేలింది. రెండు సీజన్లకు కలిపి ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యంలో 69,394 బస్తాల ధాన్యం గోల్మాల్ అయినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారని డీఎం నరసింహ మీడియాకు వెల్లడించారు. మాయమైన ధాన్యం బ్యాగుల విలువ రూ.5.90 కోట్లు ఉంటుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. తనిఖీల్లో కరీంనగర్ విజిలెన్స్ అధికారులు ప్రశాంత్రెడ్డి, అనిల్కుమార్, దినేశ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శ్రీనివాస్, రాజ్కుమార్, సిర్పూర్(టీ) తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యు సిబ్బంది పాల్గొన్నారు.