హైదరాబాద్ : దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉంటే, తెలంగాణలో మాత్రం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. ఎనిమిదేండ్లలో చీకట్లను పారదోలి, వెలుగులు నింపామన్నారు. తెలంగాణ విద్యుత్ దేశానికే ఆదర్శమని చెప్పారు. గురువారం విద్యుత్ సౌధ సమావేశ మందిరంలో తెలంగాణ ఎలక్ట్రీసిటీ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా ప్రభాకర్రావు మాట్లాడుతూ… ఉద్యోగుల సంకల్పంతోనే విద్యుత్ వెలుగులు సాధ్యమవుతున్నాయని తెలిపారు. కేసీఆర్ మార్గ నిర్దేశంలో ఎనిమిదేళ్లలో విద్యుత్ సంస్థల ప్రస్థానం సువర్ణాక్షరాలతో లిఖించబడిందన్నారు. ఒక వైపు పెరిగిన ఇంధన ధరలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ వివక్ష.. అయినప్పటికీ తెలంగాణ రికార్డు స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తోందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని, ఇదే ప్రోత్సాహాన్ని ఉద్యోగులు అందించాలని సూచించారు.
టీ జాక్ కన్వీనర్ శివాజీ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్రావుల ఆధ్వర్యంలో విద్యుత్ రంగం ఎన్నో రికార్డులు సృష్టించిందని తెలిపారు. ఎనిమిదేండ్లుగా ఉద్యోగులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. వేతన సవరణ సంఘాన్ని నియమించినందుకు కేసీఆర్, ప్రభాకర్రావులకు కృతజ్ఞతలు తెలిపారు.
టీ జాక్ చైర్మన్ కోడూరి ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఈఈఏ ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్య శెట్టి, సలహాదారు సురేందర్ రెడ్డి, నాయకులు తుల్జారాం సింగ్, బందెల రవి, శ్రావణ్కుమార్ గుప్తా, నాసర్ షరీఫ్, ఆరోగ్య రాణి, వినోద్కుమార్, కరెంట్ రావు, రమేష్, మాతంగి శ్రీనివాస్, గణేష్ రావు, ఎంఎన్ రాజేష్, తిరుపతయ్య, వెంకట్రామయ్య పున్నా నాయక్ తదితరులు పాల్గొన్నారు.