హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు గుంటకండ్ల పిచ్చిరెడ్డి (96) శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. హైదరాబాద్లోని ఒక దవాఖానలో ఇటీవలనే కాలుకు శస్త్రచికిత్స చేయించుకున్న పిచ్చిరెడ్డి.. అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలియజేశారు. పిచ్చిరెడ్డికి భార్య సుశీల, కుమార్తెలు భారతి, కరుణకుమారి, కుమారుడు దయాకర్రెడ్డి ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామ సర్పంచ్గా 45 ఏండ్లపాటు సేవలు అందించారు. సమితి ప్రెసిడెంట్గా, పాత సూర్యాపేట, తుంగతుర్తి తాలూకా సీపీఐ కార్యదర్శిగా, ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర సమితి సభ్యుడిగా పని చేశారు.
మంత్రి జగదీశ్రెడ్డి, ప్రముఖుల నివాళులు
పిచ్చిరెడ్డి రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డికి పెద్దనాన్న అవుతారు. మరణవార్త తెలిసిన వెంటనే ఆయన పిచ్చిరెడ్డి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణతోపాలు పలువురు పార్టీ నేతలు దవాఖానకు వెళ్లి పిచ్చిరెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించారు. తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టు పార్టీకే అంకితమయ్యారని, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని నారాయణ ఆయన సేవలను గుర్తుచేసుకొన్నారు. పిచ్చిరెడ్డి మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, పార్టీ నేతలు సురవరం సుధాకర్రెడ్డి, చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తంచేశారు.