హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): తెలుగు, తమిళ రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష కేసులో 24 ఏండ్ల తర్వాత సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యూషది ఆత్మహత్యకు పురిగొల్పిన కేసుగానే భావిస్తున్నామని సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పును ప్రకటించింది. ప్రధాన నిందితుడిగా ఉన్న గుడిపల్లి సిద్ధార్థరెడ్డిని దోషిగా తేల్చుతూ.. 4 వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ప్రేమించుకున్నారు. పెండ్లికి సిద్ధార్థ తల్లిదండ్రులు నిరాకరించడంతో, ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని 2002 ఫిబ్రవరి 23న కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగారు. సిద్ధార్థరెడ్డి ప్రాణాలతో బయటపడగా, ప్రత్యూష ఆ మరుసటిరోజు మరణించింది.
ఆమె తల్లి సరోజినీదేవి ఫిర్యాదు మేరకు సెషన్స్కోర్టు సిద్ధార్థరెడ్డికి ఐదేండ్ల జైలుశిక్ష విధించగా, ఏపీ హైకోర్టు రెండేండ్లకు తగ్గించింది. తన శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థరెడ్డి.. తన కుమార్తెపై లైంగికదాడి చేసి, హత్య చేశారని ప్రత్యూష తల్లి సరోజినీదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను ప్రారంభించిన జస్టిస్ రాజేశ్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం సిద్ధార్థరెడ్డికి హైకోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. ‘పోస్టుమార్టం నివేదిక, వైద్య సాక్ష్యాల ప్రకారం ఇది ఆత్మహత్యే. ఆత్మహత్య ఒప్పందంలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి చట్టపరంగా దోషిగా పరిగణించబడతాడు’ అని ధర్మాసనం పేర్కొన్నది.
లైంగికదాడి, హత్యపై ఆధారాలు లేవు..
ఈ కేసులో ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మెడికల్ రిపోర్టులు, ఇతర సాక్ష్యాల ప్రకారం ఆమె మరణం విషప్రయోగం వల్ల జరిగినట్టు కోర్టు అభిప్రాయపడింది. ప్రత్యూషపై లైంగికదాడి జరిగిందన్న ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు సిద్ధార్థరెడ్డికి విధించిన రెండేండ్ల జైలుశిక్షను సమర్థించింది. నిందితుడు 4 వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
గొంతు నులిమే చంపారు..
ప్రత్యూషను గొంతు నులిమి చంపారని, అంతకుముందు ఆమెపై లైంగికదాడి జరిగిందని ప్రత్యూష తల్లి తరఫు న్యాయవాదులు వాదించారు. విన్న సుప్రీంకోర్టు.. ఫోరెన్సిక్ సాక్ష్యాధారాల ఆధారంగా ప్రత్యూష విషం తీసుకోవడం వల్లే మరణించిందని అభిప్రాయపడింది. రెండు పిటిషన్లను కొట్టివేసింది.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మీడియా ముందుకు వచ్చిన సరోజినీదేవి భావోద్వేగానికి లోనయ్యారు. ‘నాకు న్యాయం జరుగలే దు. నా కూతురు హత్యకు గురైందని ఇప్పటికీ చెప్తున్నా. సిద్ధార్థరెడ్డికి జీవిత ఖైదు పడుతుందని ఆశించా. స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసు ప్రారంభ దశలోనే సాక్ష్యాధారాలను తారుమారుచేశారు. కుమార్తె చావుకు కారణమైన వాళ్లంతా కుకచావు చస్తారు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రత్యూష కేసులో కీలక ఘట్టాలు