హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో (Indiramma Rajyam) రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం బయటపడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) విమర్శించారు. ఓ పని టెండర్కు సంబంధించి మంత్రుల మధ్య వివాదం తలెత్తితే సీఎం ఇద్దరినీ కూర్చో బెట్టి వాటాలు పంచారని ధ్వజమెత్తారు. డెక్కన్ సిమెంట్స్ కంపెనీ వారిని గన్ పెట్టి బెదిరించారని, ఇందులో సీఎం పాత్ర ఉందని మంత్రి కూతురే ఆరోపించారన్నారు. ముఖ్యమంత్రి, సీఎం పేషీ మీద వచ్చిన ఆరోపణలు ప్రజలకు తెలుసునని చెప్పారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, డాక్టర్ కే. సంజయ్, పార్టీ నేతలు ఆయాచితం శ్రీధర్, కే. కిషోర్ గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం సీసాల హోలోగ్రాం కుంభకోణంలో సీఎం, మంత్రి మధ్య తలెత్తిన వివాదంలో అధికారిని బలి చేశారని మండిపడ్డారు. అవినీతి, ముడుపుల మీద మంత్రులు రోజూ కొట్లాడుకుంటున్నారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యమంటే కుంభకోణాల నిలయం, అవినీతి మయంగా మారిందన్నారు. తెలంగాణలో రోడ్లకు మహర్దశ అని మంత్రులు అంటున్నారని, రూ.27 వేల కోట్లతో రోడ్లు వేయబోతున్నామని మంత్రులు చెప్పారని, ఇందులో వేల కోట్ల కుంభకోణం ఉందని ఆరోపించారు. హ్యామ్ కాదు.. అది ఒక పెద్ద స్కామ్ అని, రోడ్డు బాగుచేసే ముసుగులో దోపిడీకి రంగం సిద్ధమైందన్నారు.
‘హైబ్రిడ్ అన్యుటీ మోడ్ (హ్యామ్ ) టెండర్లలో రూ.8 వేల కోట్ల కుంభకోణం జరిగింది. హ్యామ్లో కిలోమీటర్కు 85 శాతం అంచనా వ్యయం పెంచారు. రూ.9 వేల కోట్లతో పూర్తయ్యే రోడ్లకు రూ.17 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. ఇందులో రూ.8 వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం లూటీ చేస్తున్నది. సీఆర్ఎఫ్ కింద కిలోమీటర్కు రూ.కోటి 75 లక్షలు ఖర్చు అవుతుంది. హ్యామ్ కింద ఇచ్చిన టెండర్లలో కిలోమీటర్కు రూ.3కోట్ల 30 లక్షల వ్యయం అవుతుంది. సీఆర్ఎఫ్ కింద ఇచ్చిన రోడ్ల పనుల టెండర్ల జీవో, హ్యామ్ జీవో కేవలం పది రోజుల తేడాలో వచ్చాయి. సీఆర్ఎఫ్ కింద ఇచ్చిన జీవోలో కిలో మీటర్కు ఓ రేటు, హామ్ జీవోలో మరో రేటు ఎలా ఉంటుంది. హ్యామ్ రోడ్ల టెండర్లు దక్కించుకున్న వారికి 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ రూ.17 వేల కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎవరి జేబుల్లోకి వెళ్తాయో అందరికీ తెలుసు.
హ్యామ్ కింద కిలోమీటర్ రోడ్డుకు మెయింటెనెన్సుకు మరో రూ.2.5 కోట్లు కేటాయిస్తున్నారు. అంటే కిలోమీటర్ రోడ్డుకు హామ్ కింద రూ.6 కోట్లు ఖర్చవుతుంది. హ్యామ్లో 40 శాతం ప్రభుత్వం, 60 శాతం ప్రైవేటు సంస్థలు భరిస్తాయని అంటున్నారు. ప్రైవేటు సంస్థలు బ్యాంకుల నుంచి తెచ్చే అప్పులకు ప్రభుత్వమే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. మొత్తం మీద హ్యామ్ మోడల్ ప్రజల మీద పెను భారం మోపేదిగా ఉంది. ఈ టెండర్లను తక్షణమే రద్దు చేయాలి. హ్యామ్ రోడ్లలో పాలుపంచుకుంటున్న ఇంజినీర్లు, అధికారులు, బడా కాంట్రాక్టర్లు ప్రభుత్వ దోపిడీలో భాగస్వామ్యం కావద్దని మనవి. ఇందులో పెద్ద అవినీతి జరుగుతున్నందున కేంద్ర దర్యాప్తు సంస్థలు తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఇద్దరు కేంద్రమంత్రులు రాష్ట్రం నుంచి ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా హ్యామ్ టెండర్లపై సీబీఐ దర్యాప్తు చేయించాలి. దోచుకునే విషయంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ అయ్యింది. ఢిల్లీకి మాటి మాటికీ సీఎం వెళ్లేది తన అవినీతి నుంచి కాపాడుకునేందుకే. పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వరు కానీ హ్యామ్ కింద మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎలా చేస్తారు?. హ్యామ్ రోడ్ల నిబంధనలు చిన్న కాంట్రాక్టర్లకు హాని చేసే విధంగా ఉన్నాయ్. రూ.8 వేల కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేసే విధంగా ఉన్న హామ్ రోడ్ల టెండర్లపై ప్రతి వేదిక మీద మా గొంతు ఎత్తుతాం’ అని చెప్పారు.