హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రజల మధ్య చీలిక తెచ్చేలా, అభివృద్ధి నిరోధకంగా ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సంక్షేమ పథకాలకు కోతకోసే మ్యానిఫెస్టోను బీజేపీ ప్రకటించిందని, అది రాష్ర్టాభివృద్ధికి ఉపయోగపడేది కాదని దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలుచేయని వాటిని తెలంగాణలో అమలు చేస్తామనడం ప్రజలను మోసగించడమేనని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లక్షలాది ఖాళీలు నింపకుండా, ఇకడ ఉద్యోగాల భర్తీ చేస్తామంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉండీ ద్రవ్యోల్బణాన్ని అరికట్టలేని బీజేపీ.. తెలంగాణలో ఎట్లా అరికడుతుందని నిలదీశారు. కేంద్రంలో పదేండ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ధాన్యానికి రూ.3100 మద్దతు ధరను ఎందుకు నిర్ణయించలేదని ప్రశ్నించారు. పార్లమెంటులో చిన్న సవరణ చేస్తే ఎప్పుడో అమల్లోకి వచ్చే ఎస్సీ వర్గీకరణకు ఇప్పుడు మళ్లీ కమిటీ వేస్తామనడం ఎన్నికల జిమ్మికే అని పేర్కొన్నారు. మైనారిటీలకు అమలవుతున్న రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటే ఇది ప్రజల్లో చీలికకు ఉపయోగపడేదే తప్ప మరొకటి కాదని విమర్శించారు.