క్రికెట్, సినిమాలు, పబ్జీ, యూట్యూబ్, సోషల్ మీడియా.. ఇలాంటి వాటిలో పడిపోయిన చాలా మంది విద్యార్థులు పరీక్షలు దగ్గరపడేకొద్దీ టెన్షన్ పడిపోతారు. అప్పటికప్పుడు చదివేసి పరీక్షల్లో ఫెయిలవుతారు. సప్లిమెంటరీలు రాసుకుంటూ జీవితాలు గడిపేసేవాళ్లు కూడా మనకు తారసపడుతూనే ఉంటారు. కొందరైతే అసలు ఏం చేస్తున్నారో తెలియకుండానే జీవితం గడిపేస్తారు.
అలాంటి వాళ్లు జీవితాన్ని గ్రాంటెడ్గా తీసుకొని వృధా చేస్తుంటే.. వాళ్లిద్దరూ మాత్రం తమకు వచ్చిన తీరని కష్టాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. తమను వెక్కిరించాలనుకున్న విధికి సవాలు విసురుతూ ఒక్కోమెట్టూ ఎక్కుతూ జీవితంలో ఎదుగుతున్నారు.
అన్నం తినాలన్నా మరొకరి సాయం కావలసిన స్థితిలో కూడా విధికి ఎదురొడ్డి పోరాడుతున్నారు. కనీసం స్క్రైబ్స్ సాయం కూడా వద్దంటూ స్వయంగా పరీక్షలు రాసి ఇంటర్మీడియెట్ ఫస్ట్క్లాస్లో ప్యాసయ్యారు. వాళ్లే అవిభక్త కవలలు వీణ, వాణి.
పదిలోనూ అదే పట్టుదల..
పదో తరగతిలో కూడా వాళ్లకు ఇలాంటి సమస్యే ఎదురైంది. తలలు అతుక్కొని ఉన్న తామిద్దరం వేరువేరుగా పరీక్షలు రాస్తామని వాళ్లు అడిగారు. స్క్రైబ్స్ సాయం కూడా లేకుండా తమ పరీక్షలు తామే రాసి పాసయ్యారు. వీణ 9.3 గ్రేడ్ సాధించగా.. వాణి 9.2 గ్రేడ్తో పాసవడం గమనార్హం. ఇప్పుడు కూడా అదే మాదిరి స్వయం కృషితో ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.
అన్నీ బాగానే ఉన్న కొందరు విద్యార్థులు ‘‘నాలుగు మార్కులతో ఫెయిల్ చేస్తారా? మమ్మల్ని పాస్ చెయ్యాల్సిందే’’ అంటూ వెర్రి వాదనలు చేయడం మనం ఇటీవలే చూశాం. కానీ వీణ, వాణి మాత్రం విధి తమకు పరీక్ష పెడితే.. పట్టుదలతో ఎదిరించి విజయం సాధించారు.
సీఈసీ కోర్సు చదువుతున్న వీళ్లిద్దరూ వరుసగా 712, 707 మార్కులతో పాసయ్యారు. పుట్టడమే వీళ్లిద్దరి తలలు అతుక్కొని ఉన్నాయి. కానీ ఇద్దరి మెదళ్లు వేరుగా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. శస్త్రచికిత్స చేస్తే ఉపయోగం ఉంటుందేమో అని తల్లిదండ్రులిద్దరూ ప్రయత్నాలు చేశారు.
కానీ కొన్ని కీలకమైన నరాలు కూడా ఒకదానితో మరొకటి పెనవేసుకొని ఉన్నాయని, కాబట్టి ఆపరేషన్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని డాక్టర్లు తేల్చేశారు. అయితే వీళ్లిద్దరూ కోమాలోకి పోతారని, లేదంటే జీవితాంతం ఏదో ఒక లోపంతో జీవించాల్సిందేనని స్పష్టం చేశారు. దాంతో భయపడిన ఆ తల్లిదండ్రులు ఆపరేషన్ చేయించలేదు.
మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు
రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్.. వీణ, వాణిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వారి ఉన్నత చదువులకు, భవిష్యత్కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వీణ, వాణిలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. వీణ – వాణిల చదువుకు సహకరించిన అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేకంగా అభినందించారు.