స్టేషన్ఘన్పూర్, జనవరి 4: 52 ఏండ్లపాటు రాముడి సేవలో తరించిన అర్చకుడికి గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు చేయగా, గురువారం వేద పండితుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండలో తాను కాలం చేసే వరకు అర్చకుడిగా, పురోహితుడిగా, వైద్యుడిగా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారు సౌమిత్రి రంగాచార్యులు. ఆయన జ్ఞాపకార్థం రాముల వారి ఆలయ సమీపంలో ప్రజల కోరిక మేరకు రంగాచార్యుల కుమారులు కృష్ణమాచార్యులు, రామాచార్యులు ఆలయం నిర్మించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గురువారం వరంగల్ భద్రకాళి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, హైదరాబాద్కు చెందిన వేదపండితుడు కిశోర్ స్వామి, భద్రాచలం ప్రధానార్చకుడు అమరవాది మురళీకృష్ణమాచార్యులు ముఖ్య అతిథులుగా హాజరై రంగాచార్యుల విగ్రహన్ని ఆవిష్కరించారు. వేదపండితులు మాట్లాడుతూ.. రంగాచార్యులు తన జీవితాన్ని రాముడి సేవకు అంకితం చేసి, పూజలు నిర్వహించి భక్తులను మెప్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈయన సేవలను గుర్తించి ప్రభుత్వ భూమిలో ఆలయం నిర్మించడం దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కార్యక్రమంలో రంగాచార్యుల సతీమణి కృష్ణకుమారి, కుమారులు సౌమిత్రి కృష్ణమాచార్యులు, రామాచార్యులు, కూతురు వకులమాల, వరుణా చార్యులు, రిటైర్డ్ ఎస్పీ సౌమిత్రి మాధవాచార్యులు, సర్పంచ్ చల్లా ఉమాసుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.