యాదాద్రి భువనగిరి,(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో యువతకు వివిధ వృత్తులతో నైపుణ్యతను పెంపొందించే దిశగా యువజన సర్వీసుల శాఖ చర్యలు చేపడుతోంది. ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్ సంకల్పిస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబాల్లోని యువతకు వృత్తి నైపుణ్య శిక్షణను ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఉంటుందని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో డిమాండ్ ఉన్న కోర్సులలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగానే శిక్షణ ఇచ్చేందుకు వాసాలమర్రిలోనే అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ఈ శిక్షణలో తొలుత ఐదు రకాల కోర్సులలో 250 మందికి తమంతట తాము జీవనోపాధిని పొందే విధంగా తర్ఫీదు ఇవ్వనున్నారు.
దత్తత గ్రామం వాసాలమర్రిలో జీవనోపాధులపైనే సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రతిష్టాత్మక దళిత బంధు పథకాన్ని వాసాలమర్రిలోనే తొలుత ప్రారంభించి 76 కుటుంబాలకు రూ.10లక్షల సాయం అందించేందుకు సంకల్పించారు. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి లబ్ధిదారులకు ఏయే యూనిట్లపై ఆసక్తి ఉందో! అడిగి తెలుసుకున్నారు. శాశ్వతంగా ఉపాధి పొందేలా యూనిట్లను ఎంపిక చేసుకునేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడు రూ.10 లక్షలతో రెండు, మూడు యూనిట్లను సైతం ఏర్పాటు చేసుకునేలా వారిని చైతన్య పరుస్తున్నారు. త్వరలోనే యూనిట్ల ఎంపిక ప్రక్రియ పూర్తికానుండగా.. లబ్ధిదారులకు ఆయా యూనిట్లపై నైపుణ్యత పెంపొందించేలా శిక్షణా కార్యక్రమాలను చేపట్టనున్నారు. అదేవిధంగా వాసాలమర్రి గ్రామంలోని యువతకు వివిధ వృత్తి విద్యా కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
నైపుణ్య శిక్షణకు సర్వం సిద్ధం
వాసాలమర్రిలో ఇంటర్, డిగ్రీ, ఐటీఐ వంటి చదువులు చదివిన యువతీ,యువకులు 300కు పైగానే ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇవ్వనున్న శిక్షణ ఇక్కడి యువతకు ప్రయోజకంగా ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభు త్వం సంకల్పించిన నేపథ్యంలో 2019 సంవత్సరంలో యాదగిరిగుట్టలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కోర్సులలో నామమాత్రపు ఫీజుతో తర్ఫీదు ఇస్తున్నారు. అ యితే ఈ కేంద్రాన్ని ఇక్కడి నుంచి వాసాలమర్రికి తరలించి స్థానిక యువతకు ఉపయోగపడేలా సర్వం సిద్ధం చేస్తున్నారు.
స్థానిక ఎస్సీ హాస్టల్ భవనంలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మూడు నెలల పాటు ఇచ్చే ఈ శిక్షణలో 250 మందికి ఐదు రకాల కోర్సులలో నైపుణ్యతను పెంపొందిం చేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఎన్రోల్ మెంట్ ప్రక్రియ చేపట్టగా.. ఎంఎస్ ఆఫీస్ కోర్సుకు 51 మంది, ఎలక్ట్రిషియన్కు 9 మంది, టైలరింగ్కు 50 మంది, బ్యుటీషియన్ కోర్సుకు 19 మంది, మొబైల్ సర్వీస్ శిక్షణకు ఐద్గురు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఐదు కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐదుగురు శిక్షకులను కూడా నియమించారు.
డిమాండ్ ఉన్న కోర్సులలో ఉపాధి
ప్రస్తుత సమాజంలో ఎక్కువమంది ఆధారపడే రంగాలనే ఎంపిక చేసి వాటిల్లో శిక్షణ ఇచ్చేందుకు యువజన సర్వీసుల శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు అవసరమయ్యే వాటిని గుర్తించి వాటిల్లో శిక్షణ ఇచ్చినట్లయితే మున్ముందు సులభంగా ఉపాధి దొరికేందుకు అవకాశం ఉంటుందని ఆ శాఖ భావిస్తోంది. ఈ క్రమంలోనే మొబైల్ సర్వీస్, టైల రింగ్, ఎలక్ట్ట్రీషియన్, బ్యూటీషియన్, కంప్యూటర్ తదితర డిమాండ్ ఉన్న కోర్సులను ఎంపిక చేసి వాసాలమర్రి గ్రామ యువతకు శిక్షణ ఇస్తోంది. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను అందజేయనున్నారు.
దీనివల్ల బ్యాంకులు సైతం రుణాలు ఇచ్చేందుకు ముందుకు రానుండడంతో యువతీ, యువకలు తాము శిక్షణ పొందిన రంగంతో జీవనోపాధి పొందేందు కు అవకాశం కల్గు తుంది. దళిత బంధు పథకంలో భాగంగా యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారికి సైతం ప్రస్తుత శిక్షణ దోహదపడనుంది. వాసాలమర్రిలో ఏర్పాటు చేస్తున్న ఈ శిక్షణా కేంద్రాన్ని రెండు, మూడు రోజుల్లో ప్రారంభించే దిశగా నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. దత్తత గ్రామంలో సీఎం కేసీఆర్ యువతను దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న కార్యక్రమాలతో స్థానిక యువతీయువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.