సూర్యాపేట టౌన్/మాల్/టేకులపల్లి, ఏప్రిల్ 12: బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చి ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 1, 2వ వార్డులకు చెందిన 160 మంది యువకులు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం బీఆర్ఎస్లో చేరారు. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశ ప్రజలు తెలంగాణ మాడల్ అభివృద్ధినే కోరుకుంటున్నారని, అందుకే ప్రజలు, యువత స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు గ్రామానికి చెందిన బీజేపీ అధికార ప్రతినిధి అండెకారు వెంకటేశ్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కానుగుల ఆనంద్, మాజీ ఎంపీటీసీ సోమప్ప, పెద్దిరాజుతోపాటు 150 మంది బీజేపీ, కాంగ్రెస్, టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ సమక్షంలో ఉమ్మడి బేతంపూడి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 300 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలి నరందర్ పటేల్ బీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పార్టీ కండువా కప్పారు.