హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) గజ్వెల్ క్యాంపు కార్యాలయం విధ్వంసం కాంగ్రెస్ ( Congresss ) అరాచక పాలనకు అద్దమని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ( Palle Ravi Kumar Goud ) ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని ఆయన ఖండించారు. కాంగ్రెస్ గూండాల దాడి అధికార దురహంకారమేనని ఆరోపించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు అద్దం పడుతున్నదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనని అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకపోతే సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యకాండకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. దౌర్జన్యాలు, అణచివేతలు, దాడులతో బీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టాలనుకోవడం కాంగ్రెస్ అవివేకమే అవుతుందని పేర్కొన్నారు.