హైదరాబాద్, జూలై 29: (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు నేతృత్వంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జీఏడీ విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై చర్చించారు. ఉత్సవాల నిర్వహణపై పలు నిర్ణయాలు తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయడం, హైదరాబాద్లో ముఖ్యమైన భవనాలు, స్మారక చిహ్నాల వద్ద విద్యుత్తు దీపాలంకరణ, ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, స్వాతంత్య్ర పోరాటం, స్వాతంత్య్ర సమరయోధుల, జాతీయ నాయకుల చిత్రాలతో హోర్డింగ్లు, బిల్-బోర్డ్ల ప్రదర్శన, ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణ, సినిమా హాళ్లలో, పాఠశాలల్లో, కళాశాలల్లో దేశభక్తి చిత్రాల ప్రదర్శన, జానపద పాటలు, నృత్యాలు చేయించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, పాటలు, నాటికలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పరేడ్ నిర్వహించడంతోపాటు స్వాతంత్య్ర పోరాటంపై పెయింటింగ్, ప్రదర్శనలు -ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ట్యాంక్ బండ్పై అంబేదర్ విగ్రహం నుంచి విద్యార్థులతో ర్యాలీ, సంజీవయ్య పార్, జాతీయ జెండా స్తంభం వరకు జీహెచ్ఎంసీ సిబ్బందితో ర్యాలీ నిర్వహణపై చర్చించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సీఎం వోఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ఆగస్టు 8న సీఎం కేసీఆర్ హైటెక్స్లో వేడుకలను ప్రారంభించి, ప్రసంగిస్తారు. ఆగస్టు 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో ఏర్పాట్లను సమన్వయం చేస్తారు.