హైదరాబాద్,సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని పలు దేవాలయాల్లో జమ్మి మొక్కలు నాటారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాసగుప్తా ఆధ్వర్యంలో లంగర్హౌస్లోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం, రాజేంద్రనగర్ గంధంగూడలోని తుల్జాభవాని రేణుక ఎల్లమ్మ టెంపుల్, పీరంచెరువు ఆలయంలో వీటిని నాటారు. దసరా పండుగ సందర్భంగా ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో జమ్మి మొక్కలు నాటేందుకు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పాలుపంచుకొంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ అధ్యక్షుడు ఊట్కూరి శ్రీనివాసగుప్తా, ప్రధాన కార్యదర్శి ముస్త్యా శ్రీనివాస్, కంచర్ల వెంకటేశ్, రెడిశెట్టి కృష్ణమూర్తి, మేడ సత్యనారాయణ, కల్వకుంట విజయలింగం, రాజేశ్, గోవింద్, విశ్వనాదుల సురేందర్, విశ్వేశ్వరరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు విశ్వజ్యోతి, శ్రేష్టి తదితరులు పాల్గొన్నారు.