నిజామాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చొరవతో తెలంగాణ ప్రాజెక్టులు వైష్ణవాలయాల మాదిరి రూపుదిద్దుకున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. సమైక్య పాలనలో ఏనాడూ మన ప్రాజెక్టులను పట్టించుకొన్న పాపాన పోలేదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ దయతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మంచిరోజులు వచ్చాయని పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేండ్లలో రూ.40 కోట్లు మంజూరుచేసి ఎస్సారెస్పీని అద్భుతంగా మలిచారని ఆనందం వ్యక్తంచేశారు. రూ.18 కోట్లతో శ్రీరాంసాగర్ 42 వరద గేట్ల మరమ్మతు పనులకు ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం స్థానిక రైతులు, ఇరిగేషన్ ఇంజినీర్లతో మాట్లాడారు. 1996లో కేసీఆర్ మంత్రి హోదాలో పోచంపాడ్ను సందర్శించినప్పటి ఘటనకు సంబంధించిన చారిత్రక విశేషాలను వారితో పంచుకొన్నారు. 1996లో నిర్మల్ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ అభ్యర్థికి ఇంచార్జిగా కేసీఆర్ మంత్రి హోదాలో వచ్చారు. ప్రచారం నిలిచిపోవడంతో గుత్తా సుఖేందర్రెడ్డి, సత్యనారాయణగౌడ్ (టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు)తో కలిసి కేసీఆర్ పోచంపాడ్ కట్టమీదికి వెళ్లారు. ప్రాజెక్టు దుస్థితి చూసిన కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకొన్నారు. ‘మన ప్రాజెక్టులు శివాలయాల్లా ఉన్నయ్.. వాళ్ల(ఆంధ్రోళ్ల) ప్రాజెక్టులు వైష్ణవాలయాల్లా ఉన్నయ్. ఈ వివక్ష ఇలానే కొనసాగితే తెలంగాణ ఉద్యమం వచ్చినా వస్తది.. దానికి నేనే నాయకత్వం వహిస్తనేమో’ అంటూ కేసీఆర్ చెప్పిన మాటలను వేముల గుర్తుచేశారు. 26 ఏండ్ల క్రితం కేసీఆర్ అన్నట్టుగానే ఉద్యమం చేసి తెలంగాణను సాధించారని వివరించారు.
నేడు సుజల స్రవంతి
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి శంకుస్థాపన సందర్భంలో 2017లో పోచంపాడ్ కట్టపైకి సీఎం హోదాలో వచ్చిన కేసీఆర్ పుష్కలంగా నిధులు మంజూరు చేశారని మంత్రి వేముల చెప్పారు. ఇప్పటివరకు రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వెల్లడించారు. ఇవాళ బాజాప్తాగా కట్టమీదికెళ్లి ఎస్సారెస్పీని చూస్తే కనులవిందు కావడం సంతోషంగా ఉన్నదన్నారు. ప్రాజెక్టులు, రైతుల కోసం కేసీఆర్ పడుతున్న శ్రమను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.