హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): పట్టణాల్లో చేపట్టిన వైకుంఠధామాల పనులను వచ్చే అక్టోబరు నాటికి పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లకు మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం ఆదేశాలు జారీచేశారు. పట్టణ ప్రగతి అమలుపై మార్గదర్శకాలు విడుదల చేశారు. జూన్ 3 నుంచి 18 వరకు పట్టణ ప్రగతి నిర్వహించాలని, పట్టణ ప్రగతి అమలు, వైకుంఠధామాల నిర్మాణ పనులు, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్లు తదితరాలపై మార్గదర్శకాలు జారీచేశారు.
రాష్ట్రంలో ప్రతి పట్టణంలో ఇప్పటికే ఉన్న శ్మశాన వాటికలను అన్నిరకాల వసతులు, సౌకర్యాలతో వైకుంఠధామాలుగా అభివృద్ధి చేస్తున్నారు. వీటి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రూ.200 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 1429 శ్మశాన వాటికలు ఉండగా వీటిలో 289 శ్మశానవాటికలను వైకుంఠధామాలుగా అభివృద్ధి చేస్తున్నారు. వీటిల్లో ప్రహరీ, నీరు, విద్యుత్తు, మొక్కలు, స్నానాల గదులు, మూత్రశాలలు తదితర సౌకర్యాలు ఉండేలా ఆదేశాలు జారీచేశారు. పారిశుధ్య నిర్వహణపై మరింత అవగాహన కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ను బ్యాచ్లుగా సందర్శించాలని మార్గదర్శకాల్లో సూచించారు.