హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంతవరకూ అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. ఎట్టిపరిస్థితుల్లో వారికి న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. 60 ఎకరాల్లో 700 కుటుంబాలు గుడిసెల్లో నివసిస్తుండగా వారి ఇండ్లను కూల్చివేసి, ఇప్పుడు కేవలం 311 మందికే పట్టాలివ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రోడ్డునపడ్డ బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి, వారిలో మనోధైర్యాన్ని నింపి కొండంత అండగా నిలిచారని పేర్కొన్నారు. నిరాశ్రయులైన వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వారేనని, ప్రభుత్వం వారిని పట్టించుకోక పోవడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాగునీరు, భోజనవసతి కల్పించినట్టు తెలిపారు. 700 మంది బాధితులకు ఇండ్ల పట్టాలతోపాటు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు.